||సుందరకాండ ||

||అరువది మూడవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
శ్లో|| తతో మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభః|
దృష్ట్వైవో ద్విగ్నహృదయో వాక్తమేత దువాచ హ||1||
ఉత్తిష్టోత్తిష్ఠ కస్మాత్త్వం పాదయోః పతితో మమ|
అభయం తే భవేత్ వీర సర్వ మేవాభిదీయతామ్||2||
స||తతః వానరర్షభః మూర్ధ్నా నిపతితం వానరం దృష్ట్వా ద్విగ్న హృదయః ఇయయ్ వాక్యం ఉవాచ హ||
తా|| అప్పుడు ఆ వానరేంద్రుడు తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన ఆ వానరుని చూచి అదుర్దాగావున్న హృదయముతో ఈ మాటలు పలికెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రిషష్టితమస్సర్గః||

డధిముఖుడు తన సహచరులతో కలిసి రామలక్ష్మణులు సుగ్రీవుడు ఉన్న చోటికి చేరి , తను సుగ్రీవుని పాదములపై శిరస్సు వుంచెను. అప్పుడు ఆ వానరేంద్రుడు తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన ఆ వానరుని చూచి అదుర్దాగావున్న హృదయముతో ఈ మాటలు పలికెను."ఓ వీరుడా లెమ్ము .లెమ్ము. ఎందుకు నా కాళ్లమీద నీవు పడ్డావు. నీకు అభయము ఇచ్చు చున్నాను. అన్ని విషయములు చెప్పుము." అని.

ఆ వివేకముగల దధిముఖుడు ఆ సుగ్రీవునిచేత ఆవిధముగా అభయము ఇవ్వబడి లేచి నిలబడి ఈ వాక్యములు చెప్పెను.

" ఓ రాజా ! ఋక్షరజసుని చేత గాని అందుకు ముందుగాని, వాలిచేతగాని నీ చేత గానీ అనుమతి ఇవ్వబడని ఆ మధు వనము వానరులచేత తినబడినది. ఈ వనరక్షకులచేత నివారింపబడినప్పటికీ వినకుండా ఆ వానరులు మధుభక్షణము చేసి మధుపానము కూడా చేసిరి. వారు తాగిన పిమ్మట మిగిలినది పారవేస్తున్నారు. ఇతరులు ఇంకా తినుచున్నారు. వారు ఆపబడినప్పుడు కనుబొమలు ఎత్తి కోపముగా చూచుచున్నారు."

"అప్పుడు ఆ వనమునుండి నివారింపబడిన ఆవానరపుంగవులు కోపించినవారై ఈ రక్షకులను ఎదుర్కొనిరి. ఓ వానరేంద్ర అప్పుడు క్రోధముతో రక్తము నిండిన కళ్ళతో వున్న అనేకమంది వీరులు చేత ఈ వన రక్షకులు తరిమికొట్టబడిరి. కొందరు చేతితో కొట్టబడిరి. కొందరు మోకాళ్లతో తన్నబడిరి. ఇష్టమువచ్చినట్లు కొట్టబడి వారు ఆకాశమార్గములోకి విసరబడిరి. నీవు రాజు వున్నప్పుడే ఈ శూరులు ఈ విధముగా కొట్టబడిరి. నీ మధువనమును ధ్వంసముచేసి ఇష్టము వచ్చినట్లు భక్షించుచున్నారు".

ఈ విధముగా విన్నవించబడుచున్న ఆ వానరాధిపుని మహాప్రాజ్ఞుడు శత్రువీర సంహారకుడూ అయిన లక్ష్మణుడు ఇలా అడిగెను. " ఓ రాజా వనపాలకుడు అయిన వానరుడు ఎందుకు ఇక్కడికి వచ్చెను? ఎందుకు దుఃఖములో ఉన్నాడు?.దేనిని గురించి చెప్పుచున్నాడు?

మహత్ముడైన లక్ష్మణునిచేత ఈవిధముగా అడగబడి వాక్య విశారదుడైన సుగ్రీవుడు ఇట్టి వాక్యములను పలికెను.

" ఓ ఆర్యా! లక్ష్మణా! వానరవీరుడు దక్షిణదిశనుంచి వచ్చిన అంగదాదిప్రముఖులైన వానరుల చేత మధువు భక్షించబడినది అని దధిముఖుడు చెప్పుచున్నాడు. ఆ వచ్చిన వానరులచేత ఏవిధముగా ఆ వనమును ఉపయోగించినబడినదో, ధ్వంసము చేయబడినదో విని అది కృతకృత్యులుకాని వారు ఇటువంటి పని చేయరు అనిపించుచున్నది. ఆవానరులు ఏ విధముగా వనమును చేరుకొనినారో దాని బట్టి ఆ వానరులు పని సాధించినవారే. వారు దేవి ని తప్పక చూచితిరి. సందేహములేదు ఇంకెవరిచేతనో కాదు హనుమంతునిచేతనే. ఈ కార్య సిద్ధికి హనుమంతుడిలోనే తగిన కార్య దక్షత బుద్ధి పరాక్రమము శాస్త్రజ్ఞానము అన్నీ ప్రతిష్టించబడినాయి".

" ఓ మహాబాహో సీత నిజముగా చూడబడినది. చూడుము. ఆ వానరులందరూ వచ్చి మధువు సేవించుచున్నారు. ఓ పురుషులలో వృషభము వంటి వాడా ! విశ్రుతులైన వానరులు వైదేహిని చూడకుండా వరముగా వచ్చిన దివ్యమైన వనమును ధ్వంశము చేయలేరు".

అప్పుడు రాఘవునితో కూడిన ధర్మాత్ముడు అగు లక్ష్మణుడు సంతోషముతో వున్న సుగ్రీవుని నోటినుంచి వచ్చిన వాక్యములను విని అనందభరితులైరి. రాముడు లక్ష్మణుడు కూడా అధికముగా ప్రసన్నులైరి.

సుగ్రీవుడు దధిముఖుని ఈ వచనములను విని సంతోషముతో మళ్ళీ వనపాలునితో ఈ వాక్యములతో సమాధానమిచ్చెను.

"కార్యసిద్ధి సాధించినవారిచేత భుజింపబడిన ఆ వనము గురించి విని నాకు సంతోషము గా వున్నది. కృత కృత్యులైనవారిచేత చేయబడిన చేయకూడని కార్యము క్షమించబడినది. కృతార్థులైన సింహపరాక్రమము గల హనుమదాది ప్రముఖులను వెంటనే చూడాలని , సీతను కనుగొనుటకై చేసిన ప్రయత్నము గురించి వినాలని కోరికగా వున్నది".

ఆ వానరులరాజు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై , సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి కర్మసిద్ధి కాబోతున్నదని గ్రహించి అంగములన్నీ సంతోషముతో పులకిరించగా అతదు అతి ఆనందము పొందెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది మూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ
దృష్ట్వా సిద్దార్థౌ వానరాణాం చ రాజా|
అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా
బాహ్వోరాసన్నాం సోఽతిమాత్రం ననంద||29||
స|| సః వానరాణాం రాజా ప్రీతిస్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ సిద్ధార్థౌ కుమారౌ దృష్ట్వా సంహృష్టైః అంగైః కర్మసిద్ధిం బాహ్వోః ఆసన్నాం విదిత్వా అతిమాత్రం ననన్ద||
తా|| ఆ వానరులరాజు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై , సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి కర్మసిద్ధి కాబోతున్నదని గ్రహించి అంగములన్నీ సంతోషముతో పులకిరించగా అతదు అతి ఆనందము పొందెను.
||ఓమ్ తత్ సత్||